ఆయన పుట్టారు..... లోకం నవ్వింది. ఆయన వెళ్ళిపొయారు.... లోకం ఏడ్చింది.



           సినీ వినీలాకాశంలో దృవతారగా నిలచిన అక్కినేని, పలు రంగుల, హంగుల మాయా ప్రపంచంలోవివాదాలకు, విభేదాలకు దూరంగా, తామరాకుపై నీటి బొట్టులా నిలిచారు.అనేక ఒత్తిళ్ళు కలిగినా ఇజాలనూ , భేషజాలను దరికి రానీయక నిజాయితీ గా బ్రతికిన " బుద్ది మంతుడు" ఆయన.
          ఆయన ఆడితే అందరి కళ్ళూ ఆయన మీదే , అందరి కాళ్ళు ఆయన తోనే ఎందుకంటే "చెంగావి రంగు చీర కట్టుకుని ", " కడవెత్తుకొని వెళ్ళే పడుచు పిల్లలతో", స్టెప్పులు వేసి, తెలుగు పాటకు నృత్య రీతులు నేర్పిన  "దసరా బుల్లోడుఆయనే
           " పూసింది పూసింది పున్నాగ " అంటూ ఆడుతూ, పాడుకొనే తెలుగింటి ఆడపిల్లలు అందరూ " సీతారామయ్య గారి మనవరాళ్ళే " .
         " పచ్చ బొట్టూ చెరిగిపోదూలే " అంటూ మనందరి మనసులలో ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిదే , మరువలేనిదే .
        ఏ పాఠశాలలో , కళాశాలలో చదవక పోయినా, " జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులూ " , అనుకొని తన నిజ జీవితంలో ఎదురైన సంఘటనలే పాఠాలుగా మలచుకొన్నారు.
        మనకున్న దానిలో ఇతరులకు పంచాలనే "మంచి మనసు" తో విద్యా సంస్థలు, కళాశాలలు నెలకొల్పిన "ధర్మదాత" .
           "గుండమ్మ" లాటి అత్తగారు ఉందో లేదో గాని "మిస్సమ్మ" లాటి అనుకూలవతిని భార్యగా పొందారు. కొడుకులూ కోడళ్ళు, కూతుళ్ళు,         అల్లుళ్ళూ, మనవలూ, మనవరాళ్ళు తో ఆనందాలు నిండిన ఆయన ఇల్లు నిజంగా "రావుగారిల్లే" , ఒక "ప్రేమ మందిరమే" .
                     తన నటనా వైదుష్యంతో మనలకు " ప్రేమాభిషేకం" చేసారు.
              "జగమే మాయ, బ్రతుకే మాయ " అంటూ వేదాంత సారాన్ని బొధించారు.
         తీవ్ర అనారోగ్యాన్ని కూడా జయించారు. ఆయన మృత్యుంజయుడే అనుకొన్నాము. మరి ఇంతలో ఏమయిందో, " లోకంతో నాకింక పని ఏముందిఅనుకొన్నారో, నిండు జీవితాన్ని మెండుగా గడిపి, " టాటా, వీడుకోలు, గుడ్ బై, ఇంక సెలవు " అని కనిపించని "కీలుగుర్రం" ఎక్కి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిన " బహు దూరపు బాటసారి "
         మొన్నే ప్రెస్ మీట్ లో నేనింకా కనీసం ఆరేళ్ళు బ్రతుకుతాను అన్న మాటలు స్వర్గంలో దేవతలు ఈయనింకా రారులే అనుకొని ఉంటారు. హఠాత్తుగా దివికి వచ్చిన ఆయన్ని చూసి " ముందు తెలిసెనా ప్రభూ నీ మందిర మిటులుంచేమా" అని స్వాగతం పలకడానికి హడావిడి పడుతున్నారేమో !


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం